న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓబీసీ కాదని, ఆయన జనరల్ క్యాటగిరీకి చెందినవారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గురువారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. రాహుల్ గాంధీ ఇలా స్ధాయి దిగజారి మాట్లాడతారా అని బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు నరేంద్ర మోదీని తమ నేతగా భావిస్తారని, కాంగ్రెస్ భవిష్యత్ అంధకారంలో ఉండటంతో రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని, ఇది సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాబోయే రెండేండ్ల ముందే ఆయన కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీగా నోటిఫై చేసిందని బీజేపీ పేర్కొంది. రాహుల్ గాంధీ అసత్యాలు చెబుతున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. 1999 అక్టోబర్ 27న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని, నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబం ఓబీసీలకు వ్యతిరేకమని మాలవీయ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కులంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ అంతకుముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఓబీసీ క్యాటగిరీలో జన్మించలేదని, గుజరాత్లోని తేలి కులంలో ఆయన జన్మించారని చెప్పారు.2000 సంవత్సరంలో ఆ కులాన్ని బీజేపీ ఓబీసీ క్యాటగిరీలో చేర్చిందని అన్నారు. మోదీ సాధారణ కులంలోనే జన్మించారని, స్వతహాగా ఓబీసీ కాదని రాహుల్ ఆరోపించారు. మోదీ ఓబీసీగా జన్మించనందునే ఆయన తన జీవితాంతం కులగణన నిర్వహించేందుకు అనుమతించరని అన్నారు.
Read More :