న్యూఢిల్లీ : కరోనా మరణాలను ఢిల్లీ ప్రభుత్వం కప్పిపెడుతోందని కొవిడ్-19 పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆప్ సర్కార్ ను బీజేపీ గురువారం డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో మరణాల రేటు ఎందుకు అధికంగా ఉందని కాషాయ పార్టీ ప్రశ్నించింది. లెక్కకు రాని మరణాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నేత సంబిట్ పాత్రా విమర్శలు గుప్పించారు.
ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు 34,750 డెత్ సర్టిఫికెట్లు ఇచ్చాయని, ఈ వ్యవధిలో కొవిడ్ మరణాలు కేవలం 13,201 మాత్రమే నమోదైనట్టు అధికారిక గణాంకాల్లో చూపారని అన్నారు. లెక్కలోకి రాని మరణాలకు ఆప్ సర్కార్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ మరణాలపై ఆడిట్ చేపట్టాలని నిపుణులు కోరుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరోనా మరణాల జాతీయ సగటు 1.3 శాతంగా ఉంటే ఢిల్లీలో ఇది రెండు రెట్ల కంటే అధికంగా 2.9 శాతంగా ఉందని సంబిట్ పాత్రా ఆందోళన వ్యక్తం చేశారు.