ముంబై, జూలై 5: బీజేపీ, శివసేన పార్టీల మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉందని, ఎల్లకాలం ఉంటుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. తాము ప్రస్తుతం రాజకీయంగా భిన్నదారుల్లో వెళ్తున్నామని చెప్పారు. రెండు పార్టీల బంధాన్ని బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్, కిరణ్ రావ్ల మధ్య వివాహ బంధంతో పోల్చారు. ‘ఆమిర్ఖాన్, కిరణ్రావ్ల మధ్య ఉన్నటువంటి బంధమే బీజేపీ, శివసేన మధ్య ఉన్నది. వారి దారులు వేరయ్యాయి. కానీ ఇద్దరూ ఎప్పటికీ స్నేహితులే. బీజేపీ, శివసేన కూడా అంతే. మా దారులు వేరైనా.. స్నేహం ఎల్లకాలం ఉంటుంది’ అని అన్నారు. అయితే ‘స్నేహం ఉన్నదని ప్రకటించినంత మాత్రాన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాదు’ అని చెప్పారు. ‘మా మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. మాట్లాడుకొంటున్నాం. చర్చించుకొంటున్నాం. బీజేపీ, శివసేన ఇండియా, పాకిస్థాన్లు కాదు’ అని పేర్కొన్నారు.