బ్యాంక్ ఫ్రాడ్ కపిల్ వాధవాన్ డబ్బులు ఎందుకిచ్చారు?
ఆయన కంపెనీల నుంచి బీజేపీకి 27.50 కోట్లు బదిలీ
ఈసీకిచ్చిన అఫిడవిట్లే ప్రూఫ్: క్రిశాంక్
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ‘శ్రీలంకలో అదానీ వ్యాపారం కోసం మోదీ మధ్యవర్తిత్వంపై అక్కడి పార్లమెంట్ ప్యానల్లో పెద్దఎత్తున చర్చిస్తున్నారు. కానీ మన దేశంలో ఎవరూ ఆ విషయంపై నోరు తెరవటం లేదు. అక్కడ మన ఎంబసీ ముందు నిరసనకారులు ప్రధాని మోదీని, అదానీని ఇండియన్ మాఫియా అంటూ విమర్శిస్తున్నా సరే.. కేంద్రం, ప్రధాని సమాధానం చెప్పడం లేదు. ఇదిలా ఉండగానే.. రూ.34,615 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడిన డీహెచ్ఎఫ్ఎల్, దర్మన్ డెవలపర్స్ సంస్థలు 2014, 2016, 2019లో బీజేపీకి రూ.కోట్ల నిధులు బదిలీ చేశాయి. ఇటీవలే ఈ మోసంపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరి బీజేపీకి, ప్రధాని మోదీకీ, ఈ స్కాంకు సంబంధం ఏమిటి? వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మోసగాళ్లు బీజేపీకి రూ.కోట్ల నిధులు ఇవ్వటం అనుమానాలకు తావిస్తున్నది’ అని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) చైర్మన్ మన్నే క్రిశాంక్ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోదీ దీనికి జవాబిచ్చి, తన బాధ్యత నుంచి తప్పుకోవాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.
బై బై మోదీ హ్యాష్ట్యాగ్ చాలా సీరియస్ విషయమని అన్నారు. ‘నేరుగా ప్రధాని మీదే ఆరోపణలు ఉన్నప్పుడు.. ఆయన తన అధికారంతో దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నదనే దేశ ప్రజలు ఆయనను దిగిపోవాలని అంటున్నారు’ అని తెలిపారు. రుణాలు చెల్లించలేని కారణంగా డీహెచ్ఎఫ్ఎల్, దర్మన్ డెవలపర్స్, ఆర్డబ్ల్యూకే కంపెనీలను మూసివేస్తున్నట్టు డీహెచ్ఎఫ్ఎల్ సెక్రటరీ.. సెబీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు లేఖ రాశారని వెల్లడించారు. కపిల్ వాధవాన్కు చెందిన ఆర్డబ్ల్యూకే డెవలపర్స్ 2014లో రూ.10 కోట్లు, దర్మన్ డెవలపర్స్ 2016లో రూ.7.50 కోట్లు బీజేపీకి విరాళంగా ఇస్తే, 2019లో కపిల్ వాధవాన్ రూ.10 కోట్లు బీజేపీ అకౌంట్లోకి బదిలీ చేశారని గుర్తు చేశారు. ఆ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఈ అంశం స్పష్టంగా ఉన్నదని వివరించారు. ఈసీకి బీజేపీ సమర్పించిన అఫిడవిట్లు, డీహెచ్ఎఫ్ఎల్ సెక్రటరీ సెబీకి రాసిన లేఖ పత్రులను కూడా క్రిశాంక్ ట్విట్టర్లో పెట్టారు.