ముంబై: ఒక పాము నిద్రిస్తున్న ఆరేండ్ల బాలిక మెడకు చుట్టుకున్నది. రెండు గంటలపాటు ఆమె వద్దనే ఉన్న పాము చివరకు ఆ పాప కదలడంతో కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ బాలికకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఆరేండ్ల పూర్వ గడ్కరీ ఇంట్లో నిద్రిస్తుండగా ఒక పాము ఆమె మెడకు చుట్టుకున్నది. దీంతో ఆ బాలిక మేల్కొంది. అయితే పాప వద్ద పామును చూసిన కుటుంబ సభ్యులు ఆమెను కదల వద్దని చెప్పారు. పాములు పట్టే వ్యక్తికి కబురు పంపారు. దీంతో ఆ బాలిక సుమారు రెండు గంటలు మెడకు చుట్టుకున్న పాముతో కదల కుండా మంచంపై పడుకుని ఉన్నది. చివరకు పాము వెళ్లిపోతున్నదని భావించిన ఆ పాప కొంచెం కదిలింది. దీంతో ఆ నాగుపాము బాలిక చేతిపై కాటు వేసింది.
కుటుంబ సభ్యులు వెంటనే పూర్వను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఊరట చెందారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.