Jharkhand | జార్ఖండ్లోని (Jharkhand) బొకారో జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. బొకారో (Bokaro) జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీ ఫామ్లో (Poultry farm) బర్డ్ ఫ్లూ (Bird Flu) వ్యాప్తిచెందడంతో కోళ్లు, బాతులతో (Ducks) సహా దాదాపు 4 వేల పక్షులను చంపేయాలని పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ శనివారం అర్థరాత్రి ప్రారంభమైంది. ప్రభుత్వ ఫౌల్ట్రీ ఫామ్లో ఈ నెల 2 నుంచి కోళ్లు చనిపోతున్నాయి. దీనికి గల కారణాలను పరిశీలించగా బర్డ్ ఫ్లూ అని పిలుచుకునే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ (Avian influenza virus) రకానికి చెందిన హెచ్5ఎన్1 (H5N1)గా గుర్తించామని, దీనికారణంగా పక్షులు మరణిస్తున్నాయని నిర్ధారించామని అధికారులు వెల్లడించారు. ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్నాథ్ (Kadaknath) కోళ్లలో ఈ వైరస్ను గుర్తించామని, దీనికారణంగా లోహంచల్లోని (Lohanchal) ఫామ్లో ఉన్న 800 కడక్ నాథ్ కోళ్లు చనిపోయాయని, మరో 103 కోళ్లను చంపాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో లోహంచల్ ఫామ్కు కిలోమీటర్ పరిధిలో ఉన్న 3,856 కోళ్లు, బాతులను చంపేయాలని నిర్ణయించామని రాంచీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ డైరెక్టర్ డాక్టర్ బిపిన్ బిహారీ మహ్తా (Dr Bipin Bihari Mahtha) చెప్పారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఆదివారం కూడా కొనసాగుతుందని వెల్లడించారు. పౌల్ట్రీ ఫామ్ పరిధిలో 1 కి.మీ వరకు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించామని, 10 కి.మీ ప్రాంతాన్ని నిఘా జోన్గా ప్రకటించామన్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే బాతులు, కోళ్ల విక్రయాలను నిలిపివేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ హెచ్చరికలు జారీ చేశామని, కోళ్ల ఫారాలపై నిఘా పెంచామని చెప్పారు.