ముంబై: చట్టపరమైన నిషేధం లేనప్పుడు సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై జన్మ నిచ్చిన తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్పూర్ బెంచ్ పేర్కొంది. (Child kidnap) విడిపోయిన భార్య ఫిర్యాదుతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఆర్ఎర్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. 2023 మార్చి 29న తన మూడేళ్ల కుమారుడ్ని విడిపోయిన భర్త కిడ్నాప్ చేసినట్లు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
కాగా, ఆ వ్యక్తి బాంబే హైకోర్టుకు చెందిన నాగ్పూర్ బెంచ్ను ఆశ్రయించాడు. తన బిడ్డకు తాను బయోలాజికల్ తండ్రినని, సహజ సంరక్షకుడినని కోర్టుకు తెలిపాడు. తనపై నమోదు చేసిన కిడ్నాప్ కేసును రద్దు చేయాలని కోరాడు. న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనెజెస్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది. కోర్టు నుంచి ఉత్తర్వులు లేదా ఆదేశాలు లేనప్పుడు తల్లితో పాటు తండ్రి కూడా చట్టబద్ధమైన సంరక్షకుడేనని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో తల్లి కస్టడీ నుంచి బిడ్డను తీసుకెళ్లిన తండ్రిపై కిడ్నాప్ కేసు నమోదు చేయడం తగదని పేర్కొంది.
మరోవైపు హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం ప్రకారం మైనర్ బిడ్డకు మొదటి సహజ సంరక్షకుడు తండ్రి అని, ఆ తర్వాత తల్లి అని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి తల్లికి ఎలాంటి ఆదేశాలు లేకపోతే బిడ్డను తన కస్టడీలోకి తీసుకున్న తండ్రిపై కిడ్నాప్ ఆరోపణలు నమోదు చేయరాదని స్పష్టం చేసింది. ఆ వ్యక్తిపై నమోదైన కిడ్నాప్ కేసును రద్దు చేస్తూ అక్టోబర్ 6న తీర్పు ఇచ్చింది.