హైదరాబాద్ : ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ సంస్థ బయోలాజికల్-ఈ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా ధరను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు జీఎస్టీతో కలిసి రూ.840 ఉండగా.. దీన్ని రూ.250కి తగ్గించినట్లు తెలిపింది. అయితే, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అదనపు చార్జీలతో కలిపి ఒక్కో డోస్ రూ.400 అందుబాటులో ఉంటుందని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ పన్నులన్నీ కలిపి ఒక్కో డోసుకు రూ.990 వరకు చెల్లించాల్సి వచ్చేది.
వ్యాక్సిన్ను మరింత సరసమైందిగా మార్చే లక్ష్యంతో ధరను తగ్గించామని, పిల్లలకు టీకాలు వేగంగా వేసేందుకు సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ కార్బెవాక్స్ టీకాను తయారు చేసింది. 30కోట్ల డోసుల టీకాలను కంపెనీ ఉత్పత్తి చేయగా.. ఇప్పటికే దాదాపు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు కంపెనీ గత నెలలో ప్రకటించింది. ప్రస్తుతం జాతీయ కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 12-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు 3కోట్ల డోసులు పంపిణీ చేశారు. ఈ ఏడాది మార్చిలో కరోనాకు వ్యతిరేకంగా 12-14 సంవత్సరాల వయసు పిల్లలకు టీకాల పంపిణీ ప్రారంభమైంది.
గత ఏప్రిల్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 6-12 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేసేందుకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాతో పాటు 5-12 బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కార్బెవాక్స్ టీకా అభివృద్ధిలో బయోలాజిక్-ఈ కంపెనీకి టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారం అందించాయి. కంపెనీ 5-12, 12-18 సంవత్సరాల మధ్య వయసున్న 624 మంది పిల్లలపై ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించింది.