న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యింది.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మూడు వ్యవసాయ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించింది. ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం 2020, రైతుల (సాధికారత & రక్షణ) ఒప్పందం, రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్యం (ప్రమోషన్ & సులభతరం) చట్టం 2020, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం 2020ను తెచ్చింది.
కాగా, ఈ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఏడాదిపైగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక క్షమాపణలు కూడా చెప్పారు.
దీంతో మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. నవంబర్ 29 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజునే ఈ బిల్లును రికార్డు సమయంలో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేసినప్పటికీ లోక్సభలో కేవలం నాలుగు నిమిషాల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం సంతకం చేశారు.