Bilkis Bano Case | 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సామూహిక లైంగిక దాడికి గురికావడంతో పాటు కన్నబిడ్డతో సహా ఏడుగురు కుటుంబీకులను బిల్కిస్ బానో కోల్పోయింది. ఈ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రభుత్వం దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో ఇటీవలే రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తాజాగా ఈ కేసును మే 2న విచారించేందుకు జాబితా చేసింది.
ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషుల శిక్షాకాలం పూర్తి కాకుండా విడుదల చేయడానికి కారణాలు ఏంటని జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ప్రశ్నించింది. సమాజాన్ని ప్రభావితం చేసే అమానుష నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్ష తగ్గించే సమయంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం ఏకీభవించిందన్న ఒకే ఒక్క కారణం సరికాదని, కేసులో నేరం తీవ్రతను పరిగణలోకి తీసుకోవాల్సి ఉండాల్సిందని పేర్కొంది.
ఆపిల్ పండ్లను.. నారింజ పండ్లతో పోల్చవద్దని.. నరమేధాన్ని ఓ వ్యక్తి హత్యతో పోల్చొద్దంటూ వ్యాఖ్యానించింది. జస్టిస్ జోసఫ్ స్పందిస్తూ ‘ప్రభుత్వం వివేకాన్ని ఉపయోగించిందా? ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆధారం ఏంటీ’ అంటూ ప్రశ్నించారు. దోషులు తమ సహజ జీవితంలో మిగిలిన భాగమంతా జైలులోనే గడపాలని జ్యుడిషియల్ ఆర్డర్ చెబుతోందని, అయితే ఆ దోషులను కార్యనిర్వాహక శాఖ ఆదేశాలతో విడుదల చేశారన్నారు. ‘ఈ రోజు ఈ మహిళ (బిల్కిస్ బానో), రేపు మీరు కావచ్చు, నేను కావచ్చు’ అని వ్యాఖ్యానించారు.
నిష్పాక్షిక ప్రమాణాలు ఉండడం తప్పనిసరి.. కారణాలు చెప్పకపేతే.. తాము సొంత నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. బిల్కిస్ బానో కేసులో దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్షా కాలాన్ని తగ్గించడంతో గతేడాది ఆగస్టు 15న గోదా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 15 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు. అయితే, దోషుల విడుదలపై బిల్కిస్ బానోతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. డిసెంబర్లో పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాజాగా మళ్లీ కోర్టులో బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు విచారించేందుకు అంగీకరించింది. తాజాగా మే 2న విచారణ కోసం జాబితా చేసింది.