కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుపడుతూ ఎన్డీయే కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ బయటికొచ్చిన విషయం తెలిసిందే కదా. అదే శిరోమణి అకాలీదళ్ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఓ వైపు పంజాబ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ పార్టీ అగ్రనేత విక్రంసింగ్ మాఝితా కీలక ప్రకటన చేశారు. తాము మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అకాలీదళ్- బీఎస్పీ కూటమి గన అధికారంలోకి వస్తే తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు.
తాము పంజాబ్ ప్రజల కోసమే పోరాడుతున్నామని, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని తెలిపారు. పేద ప్రజలకు కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని, పంజాబ్ అంతలా వెనకబడి ఉందన్నారు. బీజేపీతో పొత్తుపై ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు.
సెప్టెంబర్ 2020 సంవత్సరంలో అకాలీదళ్ ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయేకి గుడ్ బై చెప్పేస్తున్నామని అప్పటి కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ ప్రకటించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని బీజేపీపై చాలా ఒత్తిడి తెచ్చామని, అయినా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని, అందుకే బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అకాలీదళ్ అధ్యక్షుడు పేర్కొన్నారు.