పాట్నా: ఒక రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ఒక దొంగ ప్రయత్నించాడు. అయితే స్పందించిన ప్రయాణికులు వెంటనే అతడి చేతులు పట్టుకున్నారు. దీంతో సుమారు పది కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కంపార్ట్మెంట్ కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. బీహార్లోని ఖగారియాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 14న బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్పూర్ కమల్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఒక దొంగ రైలు బోగి కిటికీ నుంచి ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించాడు. అయితే వెంటనే స్పందించిన ప్రయాణికులు ఆ దొంగ చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆ రైలు ప్లాట్ ఫామ్ చివరకు చేరగా ఆ దొంగ ప్రాధేయపడ్డాడు. తనను క్షమించి తన చేతులు వీడాలని వేడుకున్నాడు.
అయినప్పటికీ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టలేదు. గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ కంపార్ట్మెంట్ కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. ఆ రైలు పది కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఖగారియా స్టేషన్ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పరుగులు తీసి పారిపోయాడు. మరోవైపు ఆ కంపార్ట్మెంట్లోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
WATCH | Bihar Thief's Train Hangout: He Dangles Outside As Passengers Hold Arms pic.twitter.com/dvWqEbRATB
— NDTV (@ndtv) September 15, 2022