Blast in Bihar | బీహార్లోని ఒక పటాకుల వ్యాపారి ఇంట్లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు. సరాన్ జిల్లా ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయిబాగ్లో ఈ విషాదం జరిగింది. పేలుడు ప్రభావానికి సగం ఇల్లు కుప్ప కూలింది. కొంత బాగం పూర్తిగా కాలిపోయింది. ఈ భవన శిధిలాల క్రింద పలువురు చిక్కుకున్నారు. వారిని బయటకు వెలికితీసి, చికిత్స కోసం దవాఖానకు తరలించారు. చాప్రా జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ పల్లెటూరు ఉంది.
ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని సరాన్ జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే ఫోరెన్సిక్, బాంబు డిస్పోజల్ బృందాలకు సమాచారం ఇచ్చాం అని చెప్పారు. సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆ ఇంట్లో పటాకులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సుమారు గంట సేపు పేలుళ్లు కొనసాగాయి.