Tejashwi Yadav | తనకు ఇప్పటికిప్పుడు బీహార్ సీఎం కావాలన్న ఆరాటం తనకు లేదని ఆ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షనేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చెప్పారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం పతనమైంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ సారధ్యంలోని మహాఘట్బంధన్ పక్షాల ఎమ్మెల్యేల భేటీలో తేజస్వి యాదవ్ మాట్లాడారు. నితీశ్కుమార్ను సీఎంగా కొనసాగిద్దాం అని తేజస్వి చెప్పారు.
అయితే, ఆర్జేడీతో కూడిన మహా కూటమి సర్కార్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తేజస్వి యాదవ్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ వద్దే హోంశాఖ ఉండేది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే స్పష్టత వస్తుందని మహాఘట్బంధన్ నాయకుడు ఒకరు చెప్పారు.
రాష్ట్రంలోని నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, నీటి పారుదల వంటి సమస్యలపై పరిష్కారం కనుగొనాలని తేజస్వి యాదవ్ చెప్పారు. `సీఎం కావాలని నాకేం తొందర లేదు. అతిపెద్ద పార్టీగా నన్ను ఆ బాధ్యత స్వీకరించమని చెబుతున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలపైనే నా దృష్టి ఉంటుంది` అని తేజస్వి యాదవ్ అన్నారు. రబ్రీదేవి నివాసంలో జరిగిన సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ ఎంఎల్, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.