పాట్నా, ఫిబ్రవరి 28: గల్వాన్లో 2020లో చైనాతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన ఓ జవాన్ తండ్రిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దాడికి పాల్పడుతూ, ఈడ్చుకొంటూ పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లారు. ఈ ఘటన బీహార్లోని వైశాలిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకొన్నది. వివరాల్లోకెళితే.. అమర జవాన్ జయ్ కిశోర్ గుర్తుగా ఓ చోట స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆ స్మారకాన్ని తొలగించాలని జవాను తండ్రి రాజ్ కపూర్ సింగ్ను పోలీసులు ఆదేశించారు. అందుకు ఆయన ససేమిరా అన్నారు. దాంతో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఆయనను చితకబాది ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై పోలీసుల స్పందిస్తూ.. స్మారకాన్ని తొలగించాలని 15 రోజుల క్రితం చెప్పామని, ప్రభుత్వ భూమిని రాజ్ కపూర్ ఆక్రమించారని గ్రామంలోని దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. స్మారకం చుట్టూ రాత్రికి రాత్రి గోడలు వెలిశాయని వెల్లడించారు. అయితే, అమర జవాను కుటుంబంపై పోలీసుల ప్రతాపాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.