ముజఫర్పూర్, జూలై 31: నేను పుట్టకపోతే ఎవరిని పెండ్లి చేసుకుందువు అని ఎనకటికి ఒక ఆమె అన్నదట.. అట్ల ఉన్నది బీహార్ మంత్రి తీరు.. ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ను తీసుకురావడం వల్లనే ప్రజలంతా బతికి బట్టకట్టారని, లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని బీహార్ మంత్రి రాం సూరత్ రాయ్ అన్నారు. శుక్రవారం ముజఫర్పూర్లో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘కరోనా ప్రభావం వల్ల ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి.
కానీ మన దేశంలో ప్రధాని మోదీ సకాలంలో వ్యాక్సిన్ను తీసుకొచ్చారు. దీంతో మనమంతా బతికి బట్టకట్టాం. ఈ రోజు మనమంతా బతికి ఉన్నామంటే ఆ ఘనత ప్రధాని మోదీదే’ అని పేర్కొన్నారు. కరోనా ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండానూ చర్యలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీకి చెందిన ఈ మంత్రి మాటలు విన్నవాళ్లు పొగడ్తలకూ ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.