పట్నా: క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమోట్ చేశారు. తనకు గతంలో కంటే తక్కువ స్థాయి పదవి కేటాయించడంతో అలిగిన ఆ మంత్రి గంటల వ్యవధిలో రాజీనామా చేశారు. క్షణాల్లోనే ఆమోదించిన సీఎం.. దానిని గవర్నర్ ఆమోదానికి పంపారు. ఈ ఆసక్తికర పరిణామాలన్నీ జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో చోటుచేసుకున్నాయి.
ఆర్జేడీ నేత కార్తిక్ కుమార్ (Kartik Kumar).. సీఎం నితీశ్ కేబినెట్లో న్యాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఓ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో కార్తిక్కు మంత్రిపదవి కల్పించడంపై ఆలోచించాలని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన సీపీఐఎంఎల్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను కోరాయి. దీంతో సీఎం నితీశ్.. ఆయనను న్యాయ శాఖ పదవి నుంచి తప్పించి చెక్కెర పరిశ్రమ శాఖను ఆయనకు కేటాయించారు. అలక బూనిన ఆయన గంటల వ్యవధిలోనే తన పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా పత్రాన్ని సీఎంకు అందించారు. ముఖ్యమంత్రి దానిని వెంటనే ఆమెదించి, గవర్నర్కు సిఫారసు చేశారు.
ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ స్పందించింది. మహాఘట్బంధన్ ప్రభుత్వంలో అప్పుడే ఒక వికెట్ పడిపోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు స్థిరంగా ఉంటుందో చూడాలన్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జేడీయూ.. నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్.. ఆగస్టు మొదటివారంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి కొత్త సర్కారును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.