లక్నో: రూ.5,000 ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆమె గొంతునొక్కి కొడుకు హత్య చేశాడు. (Man Murders Mother) ఆ తర్వాత ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని ఉంచి నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులను అలెర్ట్ చేయడంతో దొరికిపోయాడు. బీహార్కు చెందిన హిమాన్షు, హర్యానాలోని హిసార్లో పనిచేస్తున్నాడు. ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న అతడి వద్దనే తల్లి ప్రతిమా దేవి ఉంటున్నది. తనకు రూ.5,000 ఇవ్వాలని తల్లిని హిమాన్షు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో గొంతు నొక్కి తల్లి ప్రతిమా దేవిని హత్య చేశాడు.
కాగా, తల్లిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని పడేసేందుకు కుమారుడు హిమాన్షు ప్రయత్నించాడు. ట్రావెల్ బ్యాగ్లో ఆమె మృతదేహాన్ని కుక్కాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు దానితో ప్రయాణించాడు. తల్లి మృతదేహం ఉన్న ట్రావెల్ బ్యాగ్ను త్రివేణి సంగమం వద్ద నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు త్రివేణి సంగమం వద్ద హిమాన్షు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో పోలీసులు హిమాన్షు వద్ద ఉన్న ట్రావెల్ బ్యాగ్ను తనిఖీ చేశారు. అందులో మహిళ మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. మృతురాలు హిమాన్షు తల్లిగా తెలుసుకున్నారు. డబ్బుల విషయంలో గొడవ జరుగడంతో ఆమెను హత్య చేసినట్లు అతడు చెప్పాడు. దీంతో హిమాన్సును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.