పాట్నా : బీహార్లో గంగతోపాటు ఎనిమిది నదుల నీటిమట్టం గణనీయంగా పెరుగడంతో 13 జిల్లాలకు వరద ముప్పు ఏర్పడింది. పాట్నా, బక్సర్, ముంగేర్, భాగల్పూర్ సహా పలు ప్రాంతాల్లో గంగా నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నది.
ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. పాట్నాలోని గాంధీ ఘాట్, హతీధ్ ప్రాంతాల్లో గంగా నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పాట్నా రక్షణ గోడకు ఉన్న 108 గేట్లను జిల్లా యంత్రాంగం మూసివేసింది. బక్సర్ జిల్లాలో గంగా నీటిమట్టం ప్రతి గంటకూ రెండు సెంటీమీటర్లు పెరుగుతున్నది.