Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్రంలోకి వెళ్లడం ఖాయమైంది. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆయన నియామకంపై ప్రకటన వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తారు. అయితే, ఇదే ఇప్పుడు నితీష్ కుమార్కు చెందిన జేడీయూ నేతల్ని కలవరపెడుతోంది. ఆ పార్టీ భవితవ్యంపై నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇంతకాలం ఆయన రాష్ట్రంలోనే ఉంటూ పార్టీని చూసుకునేవారు.
ఇప్పుడు ఆయన కేంద్రానికి వెళ్తే పార్టీని నడిపించేవారు ఉండరు. ఇతరులు పదవుల్లో ఉన్నా గతంలోలాగా పార్టీ నడుస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నితీష్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. నితీష్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిహార్లో అనేక చోట్ల జేడీయూ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పార్టీ కార్యాలయాల ముందు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. నితీష్ బిహార్ సీఎంగానే ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాధారణ నేతలే కాకుండా పార్టీలోని కీలక నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది పార్టీలో సంచలనంగా మారింది. ఈ అంశంపై జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ స్పందించారు. పార్టీని నిర్మించింది కార్యకర్తలే అని, వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుని నితీష్ కుమార్ సరైన నిర్ణయం తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ అంశంలో నితీష్ పునర్నిర్ణయం తీసుకుంటారేమో అని, అది ఆయన చేతుల్లోనే ఉందని నీరజ్ అన్నారు. నితీష్ నిర్ణయం పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోందన్నారు. నితీష్ నాయకత్వం వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని నీరజ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీలో నితీష్ నాయకత్వాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో కూడా పార్టీ నేతల్లో ఆందోళన ఉందన్నారు. దీనిపై కూడా నితీష్ ఆలోచించాలని ఆయన కోరారు. ఇక.. నితీష్ తర్వాత బిహార్ సీఎం పదవిని బీజేపీ చేపట్టనుంది. అయితే, ఈ అంశంలో బిహార్ ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ చేతిలో నితీష్ కీలుబొమ్మ అంటూ ఆర్జేడీ అంటోంది.