న్యూఢిల్లీ, మే 21: ఢిల్లీ ఎల్జీపై ఆప్ పోరాటానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు. నితీశ్ వెంట బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. ప్రజలు ఎన్నుకొన్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఎల్జీని అడ్డుపెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై చర్చించారు. కేంద్రం తాజా ఆర్డినెన్స్ రాజ్యసభలో ఆమోదం పొందకుండా సమైక్యంగా అడ్డుకోవాలని ప్రతిపాదించారు. ప్రజలెన్నుకున్న ఒక ప్రభుత్వం నుంచి అధికారాలు ఎలా లాక్కుంటారని నితీశ్ ప్రశ్నించారు.
‘సర్వీసెస్’పై కేంద్రం ఆర్డినెన్స్ తేవడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఓడిపోతామని బీజేపీ నేతలకు తెలుసని, ఆర్డినెన్స్ తేవడం ద్వారా ప్రజా తీర్పును ఖూనీ చేయాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.