పట్నా : 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని ఈ దిశగా తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. మనమంతా ఏకమవ్వాలి..ఈ దిశగా తాను ముందుకెళుతున్నానని, అయితే ముందుగా బిహార్లో చక్కదిద్దాల్సివని ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తదుపరి లోక్సభ ఎన్నికల్లో తాను ప్రధాని పదవిపై కన్నేశానని వస్తున్న వార్తలను వదంతులుగా తోసిపుచ్చారు. తనకు అలాంటి ఆలోచన లేదని వినమ్రంగా వెల్లడిస్తున్నానని, అందరికోసం పనిచేయడమే తన పనని, విపక్షాలన్నీ కలిసికట్టుగ పనిచేసేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు ఐక్యంగా ముందుకెళితే మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. నితీష్ ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకువచ్చి ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమితో చేతులు కలిపి తిరిగి బిహార్ పాలనా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
సంకీర్ణ సర్కార్లో నితీష్ సీఎంగా, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. తాను ఎన్డీఏకు వెన్నుపోటు పొడిచాననే ఆరోపణలను జేడీ(యూ) నేత నితీష్ కుమార్ తోసిపుచ్చారు. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ అందించడం పట్ల బీజేపీ ఆరోపణలను నితీష్ ఖండించారు. డిప్యూటీ సీఎంకు భద్రత ఇవ్వడంలో తప్పేముందని కాషాయ పార్టీ విమర్శలు అర్ధరహితమని అన్నారు.