పాట్నా, నవంబర్ 8: జనాభా నియంత్రణపై బీహార్ సీఎం నితీశ్కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం కావటంతో సీఎం నితీశ్కుమార్ బుధవారం నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ‘నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు తెలుపుతున్నా. జనాభా నియంత్రణలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పటం నా ఉద్దేశం. అంతే తప్ప..ఎవర్నో కించపర్చాలన్నది నా ఉద్దేశం కాదు’ అంటూ నితీశ్ వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా ముజఫర్పూర్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. దీనిపై ఈనెల 25న కోర్టు విచారణ చేపట్టబోతున్నది. సీఎం నితీశ్పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘జాతీయ మహిళా కమిషన్’ బీహార్ అసెంబ్లీ స్పీకర్కు లేఖ పంపింది. బీహార్ అసెంబ్లీలోనూ పలువురు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అయితే సీఎం నితీశ్ మాటల్ని వక్రీకరించకూడదని ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతు పలికారు. ఇటీవల బీహార్లో నిర్వహించిన కులగణనకు సంబంధించి నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ ‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తన భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని మాట్లాడారు.