పాట్నా, మార్చి 18: బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్కుమార్ సిన్హా-సీఎం నితీశ్కుమార్ ఎపిసోడ్లో.. స్పీకర్, బీజేపీదే పైచేయి అయినట్టు కనిపిస్తున్నది. వివాదానికి కేంద్రంగా ఉన్న డీఎస్పీ రంజన్కుమార్ను బదిలీ చేస్తూ నితీశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తాజా బదిలీతో సీఎంగా నితీశ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వం విషయంలో బీజేపీదే నడుస్తున్నదనే విషయాన్ని జేడీయూ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
అసలేం జరిగింది?
లఖిసరాయ్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిగిన సరస్వతి పూజ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని, చర్యలు తీసుకోవాలని లఖిసరాయ్ ఎమ్మెల్యేగా ఉన్న సిన్హా డిమాండ్ చేశారు. ఈ కేసు అంశాన్ని గత సోమవారం అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీనిపై నితీశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘పోలీసుల దర్యాప్తులో స్పీకర్ జోక్యం చేసుకోకూడదు. ఇదేనా సభను నడిపే తీరు?.. మీరు రాజ్యా ంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత పలువురు మంత్రుల ఒత్తిడితో స్పీకర్ను కలిసిన నితీశ్ పోలీసులను త్వరలో బదిలీ చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.
పనులేమో రావణుడిలా.. మాటలేమో భగవద్గీతలా
గుజరాత్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తనదైన శైలిలో స్పందించారు. గీత బోధనపై స్పందించాలని ఆయనను మీడియా కోరగా.. నిర్ణయం తీసుకొన్నవాళ్ల పనులు రావణుడిలా, మాటలు భగవద్గీతలా ఉంటాయని వ్యాఖ్యానించారు. ‘గీత బోధన గొప్ప నిర్ణయం. కానీ, దాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొన్నవాళ్లు ముందు అందులోని విలువలను పాటించాలి. కానీ, వాళ్ల పనులు రావణుడిలా ఉంటాయి’ అని పేర్కొన్నారు.