జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. (Setback For Congress) నాగౌర్ లోక్సభ నియోజకవర్గంలో సుమారు 400 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. శుక్రవారం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి వారు రాజీనామా చేశారు. దీంతో పార్టీ సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాగా, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. నాగౌర్ ఎంపీ, ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీకి దింపింది. అయితే కాంగ్రెస్ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీకి గట్టి పట్టున్న నాగౌర్ స్థానంలో హనుమాన్ బేనివాల్ను పోటీకి దించడంపై మండిపడ్డారు.
మరోవైపు నాగౌర్ బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధాకు అనుకూలంగా ప్రచారం చేశారని కాంగ్రెస్ నేతలపై బెనివాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మునిసిపాలిటీ చైర్పర్సన్ తేజ్పాల్ మిర్ధా, సుఖరామ్ దొడ్వాడియాలను ఆరేళ్ల పాటు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నాగౌర్లోని కాంగ్రెస్ కార్యకర్తల్లో కలకలం రేగింది. ముగ్గురు కాంగ్రెస్ నేతల సస్పెన్షన్పై నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాగా, ఇదంతా బీజేపీ చేస్తున్న ప్రచారమని, అంతా బూటకమని కాంగ్రెస్ నేత వరుణ్ పురోహిత్ ఆరోపించారు. రాజీనామా చేసినట్లుగా చెబుతున్న గుంపులో ఉన్న వాళ్లు ఎప్పుడూ కూడా కాంగ్రెస్లో పార్టీలో లేరని అన్నారు.