Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి కోల్కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రెబల్ నేత రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఎలాంటి మార్పునకు ఆదేశించలేమని కోర్టు తెలిపింది. ఈ మేరకు కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ క్రిష్ణా రావ్ ఈ కేసుపై నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది మమతకు, పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.
64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, తమ పార్టీ తరఫున రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని బెంగాల్ స్పీకర్ రతింద్ర బోస్ను కోరారు. 90 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ఇవ్వడంతో ఆయననే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాము సూచించిన ఎమ్మెల్యేను కాకుండా.. స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా జస్టిస్ క్రిష్ణా రావ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఇప్పటికిప్పుడు ప్రతిపక్ష నేతగా రితబ్రతను మార్చలేమని కోర్టు తెలిపింది.
ఈ అంశంపై స్పందించాలని స్పీకర్తోపాటు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో తమ స్పందన తెలియజేయాలని కోరింది. దీనిపై స్పందించిన ప్రతివాదులు.. తాము అఫిడవిట్ సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. అయితే, కోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. అలాగే, తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేసింది. అప్పటివరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రితబ్రతా బెనర్జీనే కొనసాగుతారని స్పష్టం చేసింది.