బెంగళూరు : నాన్ క్రిస్టియన్స్ స్టూడెండ్స్ తప్పనిసరిగా బైబిల్ చదవాలని క్లారెన్స్ హై స్కూల్ విధించిన నిబంధన వివాదాస్పదంగా మారింది. అట్లాంటి స్కూల్ లైసెన్స్ను రద్దు చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ రామ్ సేన ఫౌండర్ ప్రమోద్ ముథాలిక్ మాట్లాడుతూ.. హిందూ స్టూడెంట్స్ బైబిల్ చదవాలని పాఠశాల యాజమాన్యం నిబంధన విధించడం దారుణమన్నారు. అంత అవసరం అనుకుంటే బైబిల్ను తమ నివాసాలు, చర్చీల్లో ఉంచుకోవాలని యాజమాన్యానికి ముథాలిక్ సూచించారు. క్లారెన్స్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను మరొక స్కూల్లో చేర్పించాలని వారి తల్లిదండ్రులను ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై హిందూ జన జాగృతి సమితి కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. బైబిల్ను ప్రతిరోజూ చదవాలని విద్యార్థులను ఆదేశించడం సరికాదన్నారు. ప్రతి రోజూ బైబిల్ను స్కూల్కు తీసుకురావాలని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఒక వేళ ఎవరైనా నిలదీస్తే వారి అడ్మిషన్ను రద్దు చేస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తుందని జాగృతి సమితి తెలిపింది.
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి స్పందించారు. క్లారెన్స్ స్కూల్లో విద్యార్థులందరితో బైబిల్ చదివిస్తున్నారని తేలితే, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ జార్జ్ మాథ్యూ మాట్లాడుతూ.. వందేండ్ల నుంచి బైబిల్ లోని సారాంశాన్ని భోదిస్తున్నారని తెలిపారు. తమ పాఠశాలపై అనవసర ఆరోపణలు చేస్తున్న వారికి న్యాయవాదులే సమాధానం చెబుతారని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.