న్యూఢిల్లీ : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీకేయూ నేత రాకేష తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం సంప్రదింపులు జరిపారు.
చింతన శిబిరం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు, వ్యవసాయ కమిటీకి భూపీందర్ హుడా సారధ్యం వహిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు నేతలతో తాను చర్చించానని, వాటి పరిష్కారానికి సూచనలను తెలుసుకున్నానని భూపీందర్ హుడా తెలిపారు. తాము సాగు సమస్యలపై చింతన శిబిరం నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ముసాయిదా పత్రం రూపొందించి దానిపై చర్చలు జరుపుతామని కాంగ్రెస్ నేత వెల్లడించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతుల ఆందోళన ఫలితంగా నల్ల చట్టాలను కేంద్రం వెనక్కితీసుకుందని ఆయన గుర్తుచేశారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను ఎవరైనా కొంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎగుమతి-దిగుమతి విధానం రైతుకు హాని కలిగించేలా ఉండకూడదనేది తమ మరో ప్రధాన డిమాండని చెప్పారు.