వారణాసి : కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుతో యాంటీ బాడీలు వేగంగా పెరుగుతాయని బనారస్ హిందూ యూనివర్సిటీ జన్యు శాస్త్ర ప్రొఫెసర్ జ్ణానేశ్వర్ చౌబే అన్నారు. కొవిడ్-19 సోకి కోలుకున్న రోగులకు వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ కొరతను అధిగమించవచ్చని ఆయన సూచించారు. అసలు ఇన్ఫెక్షన్ కు గురికాని వారిలో 90 శాతం మందిలో వ్యాక్సిన్ తీసుకున్న మూడు, నాలుగు వారాల తర్వాత యాంటీ బాడీలు అభివృద్ధి అవుతుంటే కరోనా నుంచి కోలుకున్న వారిలో తొలి డోసుతోనే యాంటీ బాడీలు పెరుగుతాయని చెప్పారు.
కరోనా బారినపడి కోలుకున్న వారికి ఒక్క డోసు ఇవ్వడం ద్వారా మనం వ్యాక్సిన్ కొరత సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. తాము ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నామని చెప్పారు. వ్యాక్సిన్ డోసుల కొరత నేపథ్యంలో వ్యాక్సిన్ సింగిల్ డోసు ఎంత వరకూ పనిచేస్తుందనే అంశంపై కేంద్రం అథ్యయనం చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో బెనారస్ వర్సిటీ నిపుణుల సూచన ప్రాధాన్యత సంతరించుకుంది.