Crime news : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాజధాని భోపాల్ (Bhopal) లో ఓ మోడల్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఖాసీమ్ అహ్మద్ (Khasim Ahmed) ఆమెను హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖుష్బూ అహిర్వార్ (27) అలియాస్ ఖుషి కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ వైపు వెళ్లింది. పూర్తిగా మోడలింగ్కే పరిమితం కావాలనే ఉద్దేశంతో కొన్ని పార్ట్టైమ్ ఉద్యోగాలను కూడా మానేసింది. ‘డైమండ్ గర్ల్’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది. ఖుష్బూ గత మూడేళ్లుగా భోపాల్లో నివసిస్తోంది. నగరంలో ఆమె ఖాసీమ్ అహ్మద్ అనే యువకుడితో సహజీవనం చేసింది.
ఖుష్బూ ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం ఖాసీమ్ ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఖుష్బూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించిన వెంటనే ఖాసీమ్ అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే ఖాసీమ్ అర్ధరాత్రి తమకు ఫోన్ చేసి ఖుష్బూ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని, ఆస్పత్రికి తీసుకెళ్లానని చెప్పాడని తెలిపారు.
వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారని కూడా ఖాసీమ్ తమతో చెప్పాడని వెల్లడించారు. కానీ తన కుమార్తె ముఖం, శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఆమెను ఖాసీం తీవ్రంగా కొట్టడంవల్లే మరణించిందని ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.