Bharat Biotech | కోవాగ్జిన్ తీసుకున్న తర్వాత పారాసిటమాల్, పెయిన్ కిల్లర్స్ వేసుకోమని తాము సూచించలేదని భారత్ బయోటెక్ ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పింది. కొన్ని కేంద్రాల్లో కోవాగ్జిన్ తర్వాత పారాసిటమాల్ వేసుకోమని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. కొన్ని వ్యాక్సిన్లు వేసుకున్నతర్వాత పారాసిటమాల్ వేసుకోవచ్చని సూచించారని, తాము మాత్రం అలా ఎక్కడా పేర్కొనలేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. 30 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే, అందులో 10 నుంచి 20 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని వెల్లడించింది. అది కూడా చాలా తక్కువేనని, ఒకటి రెండు రోజుల్లో నయమయ్యాయని, ఎలాంటి మందులు అవసరమే లేదని తెలిపింది. ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం డాక్టర్లను సంప్రదించిన తర్వాతే మందులు వాడాలని భారత్ బయోటెక్ తన ట్విట్టర్లో విజ్ఞప్తి చేసింది.