న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్నది. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 2,47,417 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,63,17,927కు చేరింది. వీటిలో 5,488 ఒమిక్రాన్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. గురువారం ఒక్కరోజే 620 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తం 2,162 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మరోవైపు క్రియాశీలక కేసులు 11,17,531కి చేరాయి. గత 216 రోజుల్లో ఇవే అత్యధికం. తాజాగా 380 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,85,035కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది.
పూర్తిస్థాయి మార్కెటింగ్కి అనుమతులివ్వండి: భారత్ బయోటెక్
న్యూఢిల్లీ: కొవాగ్జిన్ టీకాకు పూర్తి స్థాయి మార్కెటింగ్ అనుమతులు ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు భారత్ బయోటెక్ సంస్థ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా అనుమతులు ఉన్నాయి.
ఒమిక్రాన్పై సమర్థంగా కొవిషీల్డ్ బూస్టర్ డోస్
ఒమిక్రాన్పై కొవిషీల్డ్ బూస్టర్ డోస్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. బూస్టర్ డోస్ తర్వాత యాంటిబాడీల స్పందన మెరుగ్గా ఉన్నదని తెలిపింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.