బెంగళూరు: భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే కాదని, అందరికీ వర్తిస్తుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. నిఫుణుల అంగీకారంతో దీనిని స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ ప్రభుత్వం 6-12 తరగతుల సిలబస్లో భగవద్గీతను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ శుక్రవారం దీనిపై స్పందించారు. నిఫుణులు ఓకే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని తెలిపారు.
మనం గతంలో స్కూళ్లలో మోరల్ సైన్స్ గురించి చదివామని కర్ణాటక విద్యా మంత్రి నగేశ్ గుర్తు చేశారు. అయితే చాలా ఏండ్లుగా దీనిని విస్మరించారని అన్నారు. ఈ నేపథ్యంలో నైతిక విద్యను తిరిగి ప్రవేశపెట్టాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం తాము దాని గురించి ఆలోచించడం లేదన్నారు. కానీ భవిష్యత్తులో తప్పకుండా నైతిక విద్యను ప్రవేశపడతామని చెప్పారు.
కాగా, నైతిక పాఠ్యాంశంపై సీఎంతో చర్చించిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యా మంత్రి నగేశ్ తెలిపారు. నైతిక శాస్త్రంలోని సబ్జెక్ట్ను విద్యా నిపుణులు మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు. భగవద్గీత, రామాయణం, మహాభారతంలో పిల్లలపై ఏది ప్రభావం చూపుతుందో దానినే సిలబస్లో ప్రవేశపెడతామని వెల్లడించారు.