న్యూఢిల్లీ, అక్టోబర్ 8: మీరు వాడుతున్న వాట్సాప్ క్లోన్ చేసి సృష్టించిన నకిలీ యాప్గానీ, అనధికారిక థర్డ్ పార్టీ యాప్ గానీ అయితే సమస్యల్లో చిక్కుకొన్నట్టే. చాటింగ్పై గూఢచర్యం జరుగుతున్నట్టే. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ట్రోజన్లు అత్యధికంగా బయల్పడుతున్న దేశాల్లో భారత్ ఒకటని, అసలైన వాట్సాప్ను క్లోన్ చేసి సృష్టించిన ‘జీబీ వాట్సాప్’ విస్తృతంగా వినియోగంలో ఉన్నదని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈఎస్ఈటీ తాజా నివేదికలో హెచ్చరించింది. ఆడియో, వీడియో సంభాషణలను రికార్డు చేయడంతోపాటు గూఢచర్యానికి పాల్పడే సామర్థ్యాలు ఇలాంటి నకిలీ యాప్స్కు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. వాస్తవానికి క్లోన్డ్ యాప్లు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉండవు. డౌన్లోడ్ వెబ్సైట్లలో మాత్రమే అందుబాటులో ఉండే యాప్ వెర్షన్లు మాల్వేర్తో నిండి ఉంటాయని, ఇలాంటి యాప్స్ జోలికి వెళ్లవద్దని ఆ నివేదిక సూచించింది.