Shinde Son Jibe on Sanjay Raut | మహారాష్ట్రలో అధికార శివసేనలో సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతున్నది. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్కు మనీ లాండరింగ్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే సెటైర్లు వేశారు.
ఈడీ సమన్లు అందుకున్నందుకు సంజయ్ రౌత్కు నా శుభాకాంక్షలు అని మరాఠీలో శ్రీకాంత్ షిండే ట్వీట్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏక్నాథ్ షిండే వర్గమే విజయం సాధిస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారని, తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. భవిష్యత్లో ఏమవుతుందో చూడండని వ్యాఖ్యానించారు.
రూ.1,034 కోట్ల పత్ర చావల్ భూమి కుంభకోణం కేసులో సంజయ్ రౌత్కు చెందిన ఆస్తులను ఈడీ గత ఏప్రిల్ నెలలో జప్తు చేసింది. తనకు ఈడీ జారీ చేసిన సమన్లపై సంజయ్ రౌత్ స్పందించారు. తాను భయపడబోనని తేల్చి చెప్పారు. తనకు సమన్లు జారీ చేసినా, ఆస్తులు సీజ్ చేసినా, కాల్చి చంపినా, జైలుకు పంపినా సంజయ్ రౌత్ బాలా సాహెబ్ ఠాక్రే మద్దతుదారుగా, శివ్ సైనిక్గా కొనసాగుతాడని స్పష్టం చేశారు.
ఏక్నాథ్ షిండేతోపాటు మరో 15 మంది ఎమ్మెల్యేల అనర్హతకు శివసేన దాఖలు చేసిన పిటిషన్, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్పై అవిశ్వాస తీర్మానం తిరస్కృతికి వ్యతిరేకంగా రెబెల్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చేనెల 11కు వాయిదా వేసింది.