(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. కర్ణాటక ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు అధికార కాంగ్రెస్ రోజుకో షాక్ ఇస్తున్నది. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలకు తెగబడుతున్నది. సరఫరా చేసే ఆ కొంత కరెంటుపై కూడా ఎడాపెడా బిల్లుల మోత మోగిస్తున్నది. ‘గృహజ్యోతి’ స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన హస్తంపార్టీ సంబంధంలేని నిబంధనలతో ప్రజలను మోసగిస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2.14 కోట్ల కుటుంబాలకు లభ్ధి చేకూరుతుందనుకొన్న ఈ స్కీమ్.. కొత్త నిబంధనల కారణంగా కేవలం 8 లక్షల మందికే పరిమితమయ్యే ప్రమాదం ఏర్పడింది. కిందటేడాది గృహ విద్యుత్తు వినియోగం సగటున 200 యూనిట్లకు మించని కుటుంబాలు మాత్రమే ఈ స్కీమ్కు అర్హులంటూ సర్కారు తొలి షాక్ ఇచ్చింది.
200 యూనిట్ల స్థానంలో పరిమితిని 165 యూనిట్లకు కుదిస్తూ మరో షాక్ ఇచ్చింది. ఇక, 166వ యూనిట్ నుంచి ఎంత వినియోగిస్తే అంత మొత్తానికి బిల్లు (యూనిట్కు రూ. 7 చొప్పున) చెల్లించాలని మూడో షాక్ ఇచ్చింది. కొత్తగా కనెక్షన్ తీసుకొన్న వారికి 59 యూనిట్ల వరకు మాత్రమే మినహాయించి 60 యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు రూ.5.6 చొప్పున.. వంద దాటితే యూనిట్కు రూ. 7 చొప్పున బిల్లు విధిస్తామని ఇంకో షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఎక్స్ట్రా ఫ్యూయెల్ అడ్జస్ట్మెంట్ కాస్ట్ (ఎఫ్ఏసీ) పేరిట యూనిట్కు 85 పైసలను అదనంగా పెంచింది. ఈ మేరకు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ (బీఈఎస్సీవోఎం) ప్రకటించింది. ఈ నవంబర్ నుంచే పెంచిన ధర అమల్లోకి వస్తుందని, డిసెంబర్ బిల్లులో ఇది జోడిస్తామని వివరించింది. దీంతో కాంగ్రెస్ సర్కారుకు పగ్గాలు అప్పగించి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారు.
అటు ప్రజలపై బిల్లుల మోత మోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పరిశ్రమలను కూడా విడిచిపెట్టలేదు. మూడేండ్లకుగానూ స్పెషల్ పవర్ టారిఫ్ను తీసుకొస్తున్నట్టు పారిశ్రామికవేత్తలకు సర్కారు తాజాగా షాక్ ఇచ్చింది. కరెంటు బిల్లులపై వినియోగదారులకు కచ్చితమైన అవగాహన ఉండటానికే మల్టీ-ఇయర్-టారిఫ్స్ (ఎంవైటీ)ని తీసుకొచ్చినట్టు కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కేఈఆర్సీ) వెల్లడించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (ఎఫ్కేసీసీఐ) మండిపడింది. దేశంలోని మిగతా రాష్ర్టాలు ఎంవైటీ విధానాన్ని తీసుకురాకముందే, ఎలాంటి అధ్యయనం చేయకుండానే కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా నిర్ణయం వినియోగదారులకు, ముఖ్యంగా పరిశ్రమలకు పెను భారమేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పుడో మూడేండ్ల తర్వాత నిర్ణయించాల్సిన విద్యుత్తు రుసుములను ఇప్పుడే ముందస్తుగా ఎలా నిర్ణయిస్తారని, ఇది దోచుకోవడమేనని ధ్వజమెత్తింది. ఇలాంటి విధానాలతో కంపెనీలు, పరిశ్రమలను ఎలా నడపాలని ఆవేదన వ్యక్తం చేసింది.