Bengaluru woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఒక మహిళ తన 14 ఏళ్ల కూతురును ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు ఉదయం అయినా తల్లీ, కూతురు ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు, వైట్ఫీల్డ్ పరిధిలో ఉండే సువర్ణ (45) అనే మహిళ, తన 14 ఏళ్ల కూతురు తారుణ్యను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త చంద్రశేఖర్ ఇంట్లో లేడు. ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌడర్గా డ్యూటీ చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. తన కూతురు తారుణ్య హత్యపై ఆమె తండ్రి, సువర్ణ భర్త చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఒకటికాగా, సువర్ణ మరణంపై ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మరోటి. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సువర్ణ ముందుగా తన కూతురును చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సువర్ణ కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కూతురు గురించి ఆమె నిరంతరం ఆవేదన చెందేదని తెలిపారు. ఈ కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది విచారణలో తేలుతుంది.