ముంబై : బుల్లీ భాయ్ యాప్ కేసులో బెంగుళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను యాప్లో అప్లోడ్ చేసి.. వాళ్లంతా ఆన్లైన్లో వేలం పాటకు ఉన్నట్లు ప్రచారం చేస్తున్న బుల్లీ యాప్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజకీయ అంశాలపై ఆన్లైన్లో యాక్టివ్గా ఉన్న ముస్లిం మహిళలను బుల్లీ భాయ్ యాప్ ద్వారా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన మహిళా జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కూడా ఈ యాప్ కేసులో చర్యలు చేపట్టారు.
బెంగుళూరుకు చెందిన విశాల్ జా అనే విద్యార్థిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే అతన్ని ముంబైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అరెస్టు అయిన మరో వ్యక్తిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఆ యువకుడు కూడా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాని నిందితుడితో ఆ యువకుడు టచ్లో ఉన్నట్లు వెల్లడించారు.
జనవరి ఒకటో తేదీన చాలా మంది ముస్లిం యువతులను ఆన్లైన్లో ఆక్షన్ పెట్టారు. గిట్హబ్ ఫ్లాట్ఫామ్ ద్వారా మహిళల ఫోటోలతో వేలం నిర్వహించారు. అయితే చాలా వరకు ఫోటోలను మార్ఫింగ్ చేసి యాప్లో పోస్టు చేసినట్లు గుర్తించారు. బుల్లీ భాయ్ యాప్ .. గత ఏడాది పట్టుబడిన సుల్లీ డీల్స్ యాప్కు క్లోన్గా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యాప్ కూడా గిట్హబ్ ఫ్లాట్ఫామ్పై హోస్ట్ చేశారు. ప్రస్తుత బుల్లీ యాప్కు సిక్కులతో సంబంధం లేదని, కానీ లింకు ఉండేలా ఆ యాప్ను రూపొందించినట్లు పోలీసులు చెబుతున్నారు. గిట్బహ్ యూజర్ యాప్ను బ్లాక్ చేశామని ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఉత్తరాఖండ్ మహిళకు 3 అకౌంట్లు..
బుల్లీ బాయ్ యాప్ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి 21 ఏళ్ల విశాల్ కుమార్ అని ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఉత్తరాఖండ్కు చెందిన మహిళ అని గుర్తించారు. ఆ ఇద్దరికీ ఒకరొకరు తెలుసు అని పోలీసులు వెల్లడించారు. మహిళా నిందితురాలు బుల్లీ యాప్కు చెందిన మూడు అకౌంట్లను హ్యాండిల్ చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విశాల్ కుమార్ కొత్త అకౌంట్ను ఓపెన్ చేశాడని, ఖల్సా పేరుతో ఆ అకౌంట్ను అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఇక డిసెంబర్ 31వ తేదీ విశాల్ మిగితా యాప్ల పేర్లను మార్చేశాడని, సిక్కుల పేర్లు వచ్చే విధంగా ఆ యాప్లకు పేర్లు పెట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.