బెంగుళూరు: బెంగుళూరులో సహజీవనం(Live-In Partner) చేస్తున్న మహిళను ఓ వ్యక్తి చంపేశాడు. ప్రెజర్ కుక్కర్ కొట్టి ఆ మహిళను హత్య చేశాడు. ఈ ఘటన శనివారం జరిగింది. తనను చీట్ చేస్తున్నాడని మహిళ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 29 ఏళ్ల వైష్ణవ్ అనే వ్యక్తి తన లివిన్ పార్ట్నర్ను మర్డర్ చేశాడు. కేరళకు చెందిన వైష్ణవ్, దేవా జంట.. రెండేళ్లుగా బెంగుళూరులో నివసిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి ఆ ఇద్దరి మధ్య పరిచయం ఉంది. కోరమంగల్ ప్రాంతంలో ఉన్న సేల్స్ అండ్ మార్కెటింగ్ సంస్థలో పనిచేశారు. శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సోదరి ఫోన్ చేసినా దేవా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆమె పక్కింటి వాళ్లకు ఫోన్ చేసింది. వాళ్లు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. పరారీలో ఉన్న వైష్ణవ్ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్న విషయం ఆ జంట పేరెంట్స్కు తెలుసు అని పోలీసులు గుర్తించారు. ఇటీవల తరుచూ ఆ జంట గొడవలు పడేదని పక్కింటివాళ్లు చెప్పారు. వైష్ణవ్పై మర్డర్ కేసు నమోదు చేశారు.