Suchana Seth | పనాజీ, జనవరి 10: గోవాలో కన్న తల్లే నాలుగేండ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేకపోతున్నారు. అయితే తన కుమారుడికి దగ్గుమందు అధిక మోతాదులో పట్టించి, తర్వాత ఊపిరాడకుండా చేసి హతమార్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ సీఈవో అయిన సుచనా సేఠ్ (39) గోవాలో తన కుమారుడిని చంపి మృతదేహాన్ని పెద్ద బ్యాగ్లో పెట్టి క్యాబ్లో బెంగళూరులో వెళుతుండగా కర్ణాటక రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
ఇది ముం దస్తు ప్రణాళికతో చేసిన హత్యేనని పోలీసులు స్పష్టం చేశారు. అయితే తాను ఈ హత్య చేసినట్టు నిందితురాలు అంగీకరించ లేదు. తాను లేచేటప్పటికే తన కుమారుడు మృతి చెంది ఉన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే ఆమె చెప్పే మాటలను తాము విశ్వసించడం లేదని, భర్తతో విభేదాల కారణంగానే ఆమె ఈ హత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్టు ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. దీంతో ఆమెను పనాజీ సమీపంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అండ్ హ్యూమన్ బిహేవియర్కు తీసుకెళ్లి మానసిక వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. గోవాలో ఆమె బసచేసిన అపార్ట్మెంట్లో రెండు ఖాళీ దగ్గు మందు సీసాలను పోలీసులు కనుగొన్నారు.