Rameshwaram Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటన నిందితుడికి సంబంధించిన తాజా ఫొటోలు బయటకు వచ్చాయి. అతడు ముఖానికి మాస్క్ (suspect seen without mask), తలకు క్యాప్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఫొటోలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. చేతిలో బ్యాగ్ పట్టుకొని ముఖానికి మాస్క్, తలకు క్యాప్ లేకుండా బస్సులో కూర్చున్నట్లు ఫొటోల్లో కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై ఎన్ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడి కోసం పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1న జరిగిన బాంబు పేలుడు ఘటన నిందితుడి వివరాలు అందిస్తే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ఈ మేరకు ‘వాంటెడ్’ పోస్టర్ను బుధవారం విడుదల చేసింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఎన్ఐఏ షేర్ చేసిన పోస్టర్లో అనుమానితుడు టోపీ, మాస్క్, కళ్లకు అద్దాలు ధరించి ఉన్నాడు. అనుమానితుడి వివరాలు తెలిపేందుకు ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్ ఇచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్కు వచ్చినట్లు గుర్తించారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్లోని బాంబుకు టైమర్ సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read..
Massive fire | నోయిడా అపార్ట్మెంట్లో భారీగా మంటలు
Gulf Of Aden | కార్గో నౌకపై క్షిపణులతో హౌతీల దాడి.. ముగ్గురు మృతి