బెంగళూరు: న్యాయ విశ్వవిద్యాలయా ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘క్లాట్’ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)లో బెంగళూరుకు చెందిన సైన్స్ విద్యార్థి ప్రద్యోత్ షా తన గురువునే అధిగమించి సంచలనం సృష్టించాడు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో వీరిద్దరికీ ఆలిండియా టాప్-5 ర్యాంకింగ్స్లో చోటు లభించింది. మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ప్రద్యోత్ 2వ ర్యాంకును కైవసం చేసుకోగా.. అతని గురువు (ఇందిరానగర్లోని కెరీర్ లాంచర్ టీచర్) రాహుల్ పులకుర్తికి 3వ ర్యాంకు లభించింది.
ఇద్దరూ సమాన స్కోరు సాధించినప్పటికీ న్యాయ విభాగంలో ప్రద్యోత్ ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాహుల్ కంటే మెరుగైన ర్యాంకు లభించింది. క్లాట్ పరీక్షలో రాజస్థాన్ విద్యార్థి 100 పర్సెంటైల్తో అగ్రస్థానంలో నిలువగా.. ఆరుగురు విద్యార్థులు 99.99 పర్సెంటైల్తో ద్వితీయ స్థానాన్ని పంచుకొన్నారు. ఫలితాలపై ప్రద్యోత్ స్పందిస్తూ.. సైన్స్ విద్యార్థినైన తాను ‘క్లాట్’లో మంచి స్కోరును సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని, గురువుతో సమానంగా స్కోరు సాధించడం నమ్మశక్యం కావడం లేదన్నాడు.