కోల్కతా : భారతీయ జనతా పార్టీ నాయకుడు, నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారిపై కేసు నమోదైంది. తన బాడీ గార్డు ఆత్మహత్య కేసులో బెంగాల్ పోలీసులు మళ్లీ దర్యాప్తు చేపట్టారు. సువేందు అధికారి బాడీగార్డు సుబ్రత చక్రవర్తి 2018, అక్టోబర్ 13వ తేదీన తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమైన చక్రవర్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, రెండు రోజుల తర్వాత మరణించాడు. ఆ సమయంలో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
అయితే ఇటీవలే చక్రవర్తి భార్య తన భర్త మరణంపై బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరణానికి సువేందు అధికారి కారణమయ్యారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.