Battle of Plassey | 1757లో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా సైన్యాలు, బ్రిటిష్ కంపెనీ సైన్యాలు ప్లాసీ దగ్గర యుద్ధానికి దిగాయి. సిరాజుద్దౌలా సేనాని మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేస్తామని ప్రలోభపరిచి అతని మద్దతుపొందాడు రాబర్ట్ ైక్లెవ్. అలా సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ప్లాసీ యుద్ధంలో గెలుపొందింది కంపెనీ.
1757… బెంగాల్ను సిరాజుద్దౌలా పాలిస్తూ ఉండేవాడు. బ్రిటిష్ వారు వర్తకంలో లాభాల కోసం.. మొగల్ చక్రవర్తి తమకు ఇచ్చిన అనుమతులను దురుపయోగం చేసేవారు. సిరాజుద్దౌలా ఆజ్ఞలను గౌరవించే వాళ్లు కాదు. దాంతో కలకత్తా సమీపంలోని కాసింబజార్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు సిరాజుద్దౌలా. అక్కడినుంచి కలకత్తాలో ఉన్న కంపెనీ కోటను ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో మద్రాసు నుంచి కంపెనీ అధికారులు రాబర్ట్ ైక్లెవ్ నాయకత్వంలో బ్రిటిష్ నావికాదళాన్ని పంపారు. సిరాజుద్దౌలాతో ఎడతెగని చర్చలు జరిపారు. చివరికి 1757లో నవాబు సైన్యాలు, కంపెనీ సైన్యాలు బెంగాల్లోని ప్లాసీ దగ్గర యుద్ధానికి దిగాయి. సిరాజుద్దౌలా సేనా నాయకులలో ఒకరైన మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేస్తామని ప్రలోభ పరిచి అతని మద్దతుపొందాడు రాబర్ట్ ైక్లెవ్. అలా సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ప్లాసీ యుద్ధంలో గెలుపొందింది కంపెనీ. ఈ సంఘటన భారతదేశ ఆక్రమణకు నాంది పలికింది. అయితే, అప్పటికి కంపెనీ ఆసక్తి అంతా వ్యాపార విస్తరణ మీదే ఉండేది. రాజ్య పాలన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేదు.
కాగా మీర్ జాఫర్ కూడా పాలనలో బ్రిటిష్ వారి జోక్యాన్ని నిరసించాడు. దాంతో అతని స్థానంలో మీర్ ఖాసింను కూర్చోబెట్టారు. అతనికీ కంపెనీతో పొసగలేదు. కంపెనీ మీర్ ఖాసింను 1764లో బక్సార్ యుద్ధంలో ఓడించింది. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అక్కడినుంచి వ్యాపార విస్తరణ కాంక్ష నుంచి రాజ్య విస్తరణకు నడుంబిగించింది. అంతేకాకుండా భారతదేశంలో కంపెనీ ఖర్చులన్నీ భారతీయులే భరించాల్సి వచ్చింది. అలా 1764లో మొదలైన దోపిడీ పర్వం 200 ఏండ్లు కొనసాగింది. భారతీయుల రక్తం పీల్చి సేకరించిన సొమ్మును.. పత్తి, పట్టు కొనుగోలుకు, కంపెనీ సైన్యాలను పోషించడానికి, కంపెనీ పాలనను పటిష్ఠం చేసుకోవడానికి, గవర్నర్ జనరల్ సహా కంపెనీ పాలకవర్గం జీతభత్యాలు, పెన్షన్లకు ఉపయోగించుకున్నారు.