హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. మార్చి చివరివారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలుచోట్ల 41 డిగ్రీలు దాటాయి. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్, మంచిర్యాల జిల్లా భీమినిలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయినట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) వెల్లడించింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 41.3 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లో, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40.5 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయిలో 40.4, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ, ఆదిలాబాద్ పట్టణంలో 40.3 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవగా, అత్యధికంగా నారాయణగూడలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్లో ఈ స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. గత వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను తాకినట్టు అధికారులు తెలిపారు. ఈ సీజన్లోనూ ఇంచుమించు గత ఏడాదిలాగే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వివరించారు. ఆది, సోమవారాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశమున్నదని, మిగతా జిల్లాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీల మేర పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.