బటిండా: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి చెందిన ఎమ్మెల్యే అమిత్ రతన్(MLA Amit Rattan)ను లంచం కేసు(Bribery Case)లో అరెస్టు చేశారు. బటిండా విజిలెన్స్ బ్యూరో ఆయన్ను అదుపులోకి తీసుకున్నది. హర్యానాలోని కర్నాల్లో ఇవాళ ఉదయం ఆయన్ను అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై ఇంకా విజిలెన్స్ బ్యూరో ప్రకటన చేయాల్సి ఉంది. గుడ్డా గ్రామ సర్పంచ్ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఆ ఎమ్మెల్యేది బటిండా రూరల్ నియోజకవర్గం.
ఎమ్మెల్యే అమిత్ రతన్పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. శిరోమని అకాలీదళ్ పార్టీ నుంచి అతన్ని గతంలో వెలివేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రజల్ని మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే రతన్ వాయిస్ శ్యాంపిళ్లను ఫోరెన్సిక్ పరీక్షలో తేల్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అరెస్టుకు సీఎంవో గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమ ఎమ్మెల్యేను రక్షించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు శిరోమని నేత దల్జీత్ చీమా ఆరోపించారు. కానీ ప్రతిపక్షాల వత్తిడి వల్లే ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే రతన్పై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.