న్యూఢిల్లీ, మే 7: బార్లు, రెస్టారెంట్లు, పబ్లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్లో దీన్ని అమలు చేయనున్నారు. వార్షిక రిటైల్ లిక్కర్ లైసెన్స్ రుసుముకు మరో రూ. 18 లక్షలు అదనంగా చెల్లించిన బార్లు, రెస్టారెంట్లు 24 గంటలపాటూ మద్యాన్ని విక్రయించవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు, బార్లు, రెస్టారెంట్లలో వేకువజామున 3 గంటల వరకు మద్యాన్ని విక్రయించడానికి అనుమతినిస్తూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే అవకాశమున్నదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బార్లు, రెస్టారెంట్ల యజమానులు స్వాగతించారు. దీన్నో ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణించారు.