Bengal Govt : దుర్గా పూజ వేడుకల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం (West Bengal govt) కీలక నిర్ణయం తీసుకుంది. పండగలో అత్యంత పవిత్రమైన రోజైన మహా అష్టమి (Maha Astami) నాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యం నిషేధాన్ని విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendhu Adhikari) ప్రకటించారు. ఆ రోజున భక్తులు దుర్గాదేవికి అత్యంత భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి సమర్పిస్తారని, ఆ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు.
ఈ ఏడాది అక్టోబర్ 19న మహా అష్టమి పర్వదినం జరగనుంది. సోమవారం కోల్కతాలోని మిలన్ మేళా ప్రాంగణంలో దుర్గా పూజ కమిటీలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. “మహా అష్టమి రోజున రాష్ట్రంవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలి. ఆ రోజున మద్యం విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు” అని ఆయన తేల్చిచెప్పారు. దుర్గా పూజ ఉత్సవాల్లో భాగంగా మహా అష్టమి నాడు మద్యంపై నిషేధం విధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
అదే సమావేశంలో సీఎం మరికొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఆర్థిక సహాయం అవసరమైన దుర్గా పూజ కమిటీలకు రూ.1 లక్ష చొప్పున గ్రాంటు మంజూరు చేస్తామని తెలిపారు. వీటితోపాటు ఉత్సవాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు, ఫైర్ సేఫ్టీ లైసెన్సుల ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్థికంగా బలంగా ఉండి, పెద్ద మొత్తంలో నిధులు కలిగిన కమిటీలు స్వచ్ఛందంగా ఈ గ్రాంటును వదులుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విగ్రహాల నిమజ్జన ఊరేగింపులో డీజే మ్యూజిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అక్టోబర్ 25న లక్ష్మీ పూజ ఉన్నందున అంతకు ముందే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. మతపరమైన మనోభావాలను కించపరిచే విధంగా పండళ్లు, థీమ్లు ఉండకూడదని ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వం రెడ్ రోడ్లో ఘనంగా నిర్వహించిన పోస్ట్-పూజ కార్నివాల్ను కూడా ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.