న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్న మోదీ సర్కార్ కన్ను ఇప్పుడు పోస్టల్ శాఖపై పడింది. దీన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిపై పోస్టల్ శాఖ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు. కార్పొరేటీకరణ ప్లాన్ నుంచి వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
దేశ ఆస్తులను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై పోస్టల్ ఉద్యోగులు కన్నెర్ర చేశారు. ఇప్పటికే పలు రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న మోదీ సర్కార్.. తపాలా శాఖలోని పలు విభాగాలను కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. పోస్టల్ డిపార్ట్మెంట్కి చెందిన 4.5 లక్షల మందిలో మెజార్టీ ఉద్యోగులు(60 శాతం మంది) నిరసనల్లో పాల్గొన్నారని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్(ఎన్ఎఫ్పీఈ) పేర్కొన్నది. కార్పొరేటీకరణ ప్రణాళికలపై పోస్టల్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్(పీజేసీఏ) నేతృత్వంలోని పోస్టల్ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
కార్పొరేటీకరణకు యత్నాలు
‘ఇండియా పోస్టు’కు ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన నెట్వర్క్ ఉన్నది. ఉత్తరాలను వాటి గమ్యస్థానాలకు చేర్చడం వంటి ప్రధానమైన విధి నుంచి.. పోస్టల్ శాఖ తన పనిని మరింత విస్తృతం చేసుకున్నది. చిన్నమొత్తాల పొదుపు స్కీమ్ కింద డిపాజిట్లు తీసుకోవడం,జీవిత బీమా కల్పించడం, ఉపాధి హామీ వేతనాల పంపిణీలో ఏజెంట్గానూ వ్యవహరిస్తున్నది. ఇప్పడు కేంద్రం ప్రభుత్వం వీటిల్లోని కొన్ని విధులను కార్పొరేటీకరించాలని చూస్తున్నదని పోస్టల్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ ఫ్రాంచైజీ యూనిట్ల వ్యవస్థను ఎన్ఎఫ్పీఈ ప్రధాన కార్యదర్శి జనార్థన్ మజుందార్ తప్పుబట్టారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఫ్రాంచైజింగ్ కంటే ఎక్కువ పోస్టాఫీసులను తెరువడం ద్వారా పోస్టాఫీసుల అవసరాన్ని తీర్చాలని డిమాండ్ చేశారు.
ఐపీపీబీ చేతికి బ్యాంకింగ్, బీమా
ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) ప్రవేశపెట్టడం ద్వారా చిన్న మొత్తాల పొదుపు స్కీమ్ను కార్పొరేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉద్యోగులు నిరసిస్తున్నారు. ఐపీపీబీని కేంద్రం 2018లో తీసుకొచ్చింది. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ కింద మొట్టమొదటి కార్పొరేట్ సంస్థ. పోస్టల్ ఉద్యోగుల ఆందోళనలను విస్మరిస్తూ దేశవ్యాప్తంగా 650 ఐపీపీబీ బ్రాంచ్లు, 2,250 యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ ప్రధాన విధులు మాత్రమే డిపార్ట్మెంట్ వద్ద ఉంటాయని పేర్కొంటూ బ్యాంకింగ్, బీమా విధులను ఐపీపీబీలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో ప్రతిపాదించింది. దీనిపై పోస్టల్ ఉద్యోగులు తీవ్ర నిరసనలు తెలిపారు.
బ్యాంకింగ్, బీమా విధుల పూర్తి విలీనంపై ప్రభుత్వం ఆగస్టు 15న ప్రకటన చేసే అవకాశం ఉన్నదని అన్నారు. వాస్తవానికి ఇవి విశాశకరమైన చర్యలు అని, చివరకు పోస్టాఫీసు సేవింగ్స్లో ప్రజలు దాచుకున్న సొమ్ముపై కార్పొరేట్ల పట్టును చట్టబద్ధం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సొమ్ము భద్రత కూడా ప్రశ్నార్థకం అవుతుందన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ తన బ్యాంకింగ్, బీమా విధులను నిర్వర్తించే పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు(పీఎస్వోబీ)లో దాదాపు 30 కోట్ల ఖాతాలు ఉండగా, అందులో దాదాపు 10 లక్షల కోట్ల మేర బ్యాలెన్స్ ఉన్నదని ది హిందూ తన నివేదికలో పేర్కొన్నది. పీఎస్వోబీ స్వభావాన్ని, నిర్మాణాన్ని మార్చడంపై ప్రభుత్వం సంబంధిత వాటాదారులతో అర్థవంతమైన చర్చలు జరుపాలని మజుందార్ డిమాండ్ చేశారు.
రైల్వే నుంచి ఆర్ఎంఎస్ డీలింక్!
రైల్వేశాఖ నుంచి రైల్వే మెయిల్ సర్వీసు(ఆర్ఎంఎస్)ను డీలింకింగ్ చేయడంపై కూడా ఉద్యోగుల్లో కొత్తగా ఆందోళనలు నెలకొంటున్నాయి. వేగవంతమైన డెలివరీకి రైల్వేను వినియోగించుకొనేందుకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంసిద్ధత ప్రకటించింది. దీనిబట్టి చూస్తే.. కేంద్ర ప్రభుత్వం ఏ దిశగా సాగుతున్నదో అర్థమవుతున్నదని, మోదీ సర్కార్ ‘కార్పొరేటీకరణ గొడ్డలి’ ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్, ఆర్ఎంఎస్పై పడిందని ఆలిండియా ఆర్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నేత సురేశ్ పేర్కొన్నారు.