తిరువనంతపురం: ఇద్దరు యువకుల బ్యాంకు ఖాతాల్లో పొరపాటున రూ.2.44 కోట్లు జమ అయ్యాయి. అయితే బ్యాంకు తిరిగి వెనక్కి తీసుకునేలోపు వారిద్దరూ ఆ డబ్బంతా ఖర్చు చేశారు. వ్యక్తిగత రుణాలు తీర్చడంతోపాటు ఖరీదైన ఐఫోన్లు కొన్నారు. పలు బ్యాంకు ఖాతాల్లోకి కొంత డబ్బును మళ్లించారు. స్టాక్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఆ డబ్బంతా ఖర్చు చేశారు. ఈ పొరపాటును గ్రహించిన ఆ బ్యాంకు ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక బ్యాంకు సర్వర్ మెర్జర్ సందర్భంగా సాంకేతిక సమస్యల వల్ల పొరపాటున ఇద్దరు యువకుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2.44 కోట్లు జమ అయ్యాయి.
కాగా, దీనిని గ్రహించిన ఆ ఇద్దరు యువకులు ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లలేదు. పైగా ఆ మొత్తాన్ని బ్యాంకు తిరిగి వెనక్కి తీసుకునేలోపు ఖాతా నుంచి ఆ డబ్బును ఖాళీ చేయాలని నిర్ణయించారు. చాలా ఏళ్లుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న ఆ ఇద్దరూ లక్షలాది డబ్బును స్టాక్మార్కెట్లోకి మళ్లించారు. దీని కోసం 19 బ్యాంకుల్లో 54 కొత్త ఖాతాలు తెరిచారు. అలాగే వారు తీసుకున్న వ్యక్తిగత రుణాలను తీర్చేశారు. ఖరీదైన నాలుగు లేటెస్ట్ మోడల్ ఐఫోన్లను కొన్నారు. ఇలా 171 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.2.44 కోట్ల డబ్బును ఖర్చు చేశారు.
మరోవైపు జరిగిన పొరపాటును ఆ బ్యాంకు గ్రహించింది. అయితే ఇద్దరి యువకుల బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.2.44 కోట్ల డబ్బును అప్పటికే పూర్తిగా విత్ డ్రా చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.